ఓటుకు నోటు కేసులో నిందితుల ఇళ్లల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సుమారు ఐదుగంటల పాటుగా తనీఖీలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఇళ్లల్లో, వారికి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఏసీబీ డీఎస్పీ సునితారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ ఇంట్లో సోదాలు నిర్వహించి, హార్డ్ డిస్క్, ఆయన పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఈ కేసులో మరో నిందితుడైన సెబాస్టియన్ ఇంట్లో పాస్ పోర్టు, బ్యాంకు పాస్ బుక్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉదయసింహ ఇంట్లో విదేశీ మద్యం భారీగా లభ్యమైందని ఏసీబీ అధికారులు తెలిపారు.