ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్) వేలంపై డబుల్స్ స్పెషలిస్ట్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అసంతృప్తి వ్యక్తం చేసింది. మాట మాత్రం చెప్పకుండా ఐబీఎల్ వేలంలో తన కనీస ధరను తగ్గించడం పట్ల ఆమె ఆవేదన వెలిబుచ్చింది. అన్యాయంగా తనపై రెబల్ అనే ముద్ర వేశారని ఆమె వాపోయింది. ‘నేను చాలా నిరాశ చెందాను. నేను, అశ్విని ఐకాన్ ప్లేయర్లుగా కాంట్రాక్ట్పై సంతకం చేశాము. అందువల్ల మరింత మెరుగైన మొత్తం దక్కాల్సింది. మా కనీస ధర తగ్గించిన విషయం కూడా మాకు చెప్పలేదు. మహిళల డబుల్స్ తొలగించి పురుషుల సింగిల్స్ మ్యాచ్ను పెట్టిన విషయం కూడా నాకు ఆలస్యంగా తెలిసింది. ఇంకే మాట్లాడగలను. ఇది నన్ను తీవ్రంగా బాధ పెట్టింది’ అని వేలం ముగిసిన తర్వాత జ్వాల తన స్పందన తెలియజేసింది. ఐకాన్ ప్లేయర్లుగా గుర్తింపు ఉండి కనీస ధర (50 వేల డాలర్లు)తో ఐబీఎల్) వేలంలో నిలిచిన జ్వాల, అశ్వినిలకు నిరాశే ఎదురైంది. జ్వాలను 31 వేల డాలర్లకు ఢిల్లీ జట్టు చేజిక్కించుకోగా, అశ్విని కోసం పుణే 25 వేల డాలర్లు మాత్రమే వెచ్చించింది.