
సాక్షి, కృష్ణా: విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. శ్రావణ శుక్రవారం అర్థరాత్రి సమయంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మృతిచెందిన ఆవులకు పోస్ట్మార్టం చేసిన తరువాత వాటి మృతికి కారణం చెబుతామని వైద్యులు తెలిపారు. మరికొన్ని పశువులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో కూడా ఇదే గోశాలలో పుడ్ పాయిజనింగ్ కారణంగా 24 గోవులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. 100 గోవులు చనిపోవడంపై గో సంరక్షణ కార్యదర్శి సాహు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. ఘటన జరగడం బాధకరమన్నారు. రాత్రి సమయంలో పశువులకు వేసిన దాణా పాయిజనింగ్ అయి వుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.