
'స్కెచ్ వేసి లాడ్జీకి రప్పించి, నిర్బంధం'
విజయవాడ : బెజవాడలో రోజూ వారి వడ్డీ వ్యాపారుల అరాచకం మితిమీరి కిడ్నాప్ వరకూ దారి తీసింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఓ యువకుడిని కాల్మనీ నిర్వాహకులు నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిని రెండు రోజులుగా గవర్నర్పేటలోని ఓ హోటల్లో నిర్బంధించి దాడి చేస్తున్నట్లు సమాచారంతో సూర్యారావుపేట పోలీసులు అక్కడకు వెళ్లి బాధితుడికి విముక్తి కలిగించడంతో పాటు, దాడికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం కృష్ణాజిల్లా కలిదిండికి చెందిన నరేష్ కొంతకాలం కిందట నగరానికి వచ్చి గుణదలలో స్థిరపడి కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. అతని మరదలు బిందు ద్వారా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నరేష్ రెండు నెలల క్రితం శ్రావణ్ కుమార్ వద్ద రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. పదిరోజుల్లో తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. తరువాత అప్పు ఇచ్చినవారు ఫోన్ చేసినా స్పందించటం లేదు.
నరేష్కు మరలా డబ్బు అవసరమై బిందును రూ.10వేలు అడిగాడు. దాంతో నగదు చెల్లించకుండా నరేష్ తిరుగుతుండడంతో, అతడిని స్కెచ్ వేసి లాడ్జీకి రప్పించారు. ఈ నెల 22న గుంటూరు వస్తే డబ్బు ఇస్తామని చెప్పటంతో అక్కడికి వెళ్లాడు. అక్కడ శ్రావణ్ కుమార్, బిందు కలిసి డబ్బు ఇస్తామని చెప్పి నగరానికి తీసుకు వచ్చారు. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలంటూ రామవరప్పాడులోని ఓ హోటల్లో నిర్బంధించారు. అందుకు శ్రావణ్ కుమార్ స్నేహితులు సహకరించారు.
మూడు జులపాటు గుంటూరు, విజయవాడలలోని వివిధ లాడ్జీల్లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ సూర్యారావుపేట అనుపమ హోటల్లో బస చేయగా, గట్టిగా అరుపులు వినిపించడంతో ... హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసుల రాకతో మొత్తం వ్యవహారం బయటపడింది. నరేష్తోపాటు హోటల్లో ఉన్న ఆరుగురు కాల్ మనీ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్మనీ వ్యాపారుల వివరాలపై కూపీ లాగుతున్నారు.