
'రాష్ట్ర విభజనకు ఉపయోగపడిన బాబు అనుభవం'
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుభవం దేనికి ఉపయోగపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు తమ నాయకుడు అది చేశాడు, ఇది చేశాడు, ఎంతో అనుభవం ఉంది అని చెబుతుంటారని, చంద్రబాబు అనుభవం రాష్ట్రం విభజనకు ఉపయోగపడిందన్నారు. విభజనపై చంద్రబాబు వైఖరి ఏమిటి? అని అడిగారు.చంద్రబాబు నాయుడు లేఖే సోనియా గాంధీ ధైర్యానికి కారణం అని చెప్పారు. చిన్న వయసులో రాజకీయాలలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన రెడ్డి అనుభవంలేకపోయినా సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నారని చెప్పారు.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు తలా ఒక మాటతో ఉద్యం నీరుగారుతోందని పేర్కొన్నారు. కొంతమంది రాయల తెలంగాణ అని, మరికొంత మంది విశాఖపట్నం రాజధాని చేమని, ఇంకొందరు ఒంగోలు వద్ద రాజధాని చేయమని ....ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారని తెలిపారు.
సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వైఎస్ఆర్ సిపి పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె చెప్పారు. ఈ నెల 10 నుంచి విద్యార్థులు, యువకులు ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. 11న రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల రోజు ఈ నెల12న రహదారుల దిగ్బంధనం చేపడతామన్నారు. 13న అన్ని వర్గాల వారితో సమావేశమవుతామని చెప్పారు.