
బాహుబలిని ఆస్కార్కు సిఫార్సు చేస్తా
మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి తెలుగువారి చిత్ర నిర్మాణ ప్రతిభా పాటవాన్ని చాటిచెప్పిన బాహుబలి సినిమాను ఆస్కార్కు సిఫారసు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సినిమాను ఆద్యంతం హృద్యంగా మలిచిన రాజమౌళికి హ్యాట్సాఫ్ చెబుతూ... చిత్ర నిర్మాణ యూనిట్కు అభినందలు తెలుపుతూ మంత్రివర్గం తీర్మానించిందని వివరిం చారు. బాహుబలి యూనిట్ను త్వరలో అమరావతికి తీసుకొచ్చి సన్మానిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కన్సార్టియం కంపెనీకి స్విస్ ఛాలెంజ్లో అప్పగించేందుకు నిర్ణయించామని తెలిపారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని సీఎం పేషీలో మంగళవారం రాత్రి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు.
మంత్రివర్గ నిర్ణయాలు
► కళాతపస్వి కె.విశ్వనాథ్కు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావడం పట్ల హర్షం.
► ఒలింపిక్ విజేత పీవీ సింధుకి గ్రూప్–1 సర్వీస్లో నియమించేందుకు వీలుగా చర్యలు.
► కొత్తగా 800 కానిస్టేబుల్ పోస్టులకు ఆమోదం. 25 డివిజినల్ అక్కౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్–2 పోస్టులను గ్రేడ్–1 పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తూ ఆమోదం.