
ఆ గ్రామాల్లో ఎందుకు పర్యటించరు?
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణానికి అభ్యంతరాలు చొప్పొద్దని ఛత్తీస్గఢ్ సీఎంను కోరడానికే చంద్రబాబు ఆ రాష్ట్రానికి వెళ్లారని ఆయన ఆరోపించారు. ఖమ్మంలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో ఎందుకు పర్యటించరని ప్రశ్నించారు. ముంపు గ్రామాలను కాపాడుకుంటామన్న కేసీఆర్.. ఆ గ్రామాలు ఏపీలో విలీనం కావడంతో అది ముగిసిన అంశం అనడం సరికాదన్నారు.
చంద్రబాబు, కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి గిరిజనులకు భరోసా ఇవ్వాలని కోరారు. ప్రస్తుత డిజైన్ మార్చి మూడు బ్యారేజీలతో ప్రాజెక్టును నిర్మించాలన్న నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పోలవరం నుంచి ఉత్పత్తి కానున్న విద్యుత్ లో తెలంగాణకు వాటా ఇవ్వాల్సిందేనని పొంగులేటి డిమాండ్ చేశారు.