
'ఎర్ర' కేసులో చైనా దేశీయుడి అరెస్ట్
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు చైనా దేశానికి చెందిన యంగ్పెంగ్ (36)ను గురువారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో హైదరాబాదు-వరంగల్ హైవేపై అరెస్టు చేశారు.
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు చైనా దేశానికి చెందిన యంగ్పెంగ్ (36)ను గురువారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో హైదరాబాదు-వరంగల్ హైవేపై అరెస్టు చేశారు. అతని నుంచి రెండు ఎర్రచందనం దుంగలు, పాస్పోర్టు, చైనా దేశానికి చెందిన కరెన్సీని, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి సిబ్బియాలకు చెందిన కె. శ్రీనివాసరాజు (40)ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
వీరిద్దరినీ చిత్తూరులోని మూడో అదనపు జిల్లా కోర్టులో శుక్రవారం హాజరుపరచగా న్యాయమూర్తి రాఘవేంద్ర ఈనెల 21వ తేదీ వరకు రిమాండు విధించారు. వీరిని చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. గతనెల 24న టూరిస్ట్ వీసాపై యంగ్పెంగ్ చైనా నుంచి హైదరబాదుకు చేరుకున్నారు. ఇతనికి ఎర్రచందనం దుంగలను విక్రయించడానికి మన రాష్ట్రానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాదు సమీపంలోని ఘట్కేసర్ టోల్ప్లాజా వద్ద గురువారం అర్ధరాత్రి స్మగ్లర్లంతా డీల్ కుదుర్చుకుంటుండగా చిత్తూరు జిల్లాకు చెందిన ఆపరేషన్ రెడ్, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడిచేసి పట్టుకున్నారు.