
ఏపీ బీజేవైఎం ప్రెసిడెంట్ రమేశ్ నాయుడు(పాత చిత్రం)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీ బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుపై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీజేపీ యువ మోర్చా ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. ప్రతీ ఏటా కరవు బారిన పడుతున్న రాయలసీమను శాశ్వతంగా ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గాలపై చర్చ జరగాల్సి ఉందని, గ్రామాలలో కనీసం తాగడానికి మంచి నీరు కూడా దొరకడం లేదని లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల మేత దొరకని పరిస్థితి ఏర్పడిందని, పశువులను కబేళాలకు తరలించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
వలసలు వెళ్తున్న రైతాంగాన్ని ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకోవాలని కోరారు. వేరుశెనగ, జొన్న, సజ్జలు, రాగి, మొక్కజొన్న పంటలు పండించే రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ కల్పించాలని కోరారు. గతంలో మీరు అట్టహాసంగా ప్రారంభించిన రెయిన్ గన్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని మరోసారి హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment