
ఈడీఎల్ఐఎఫ్ పరిమితి 6 లక్షలకు పెంపు
ఆర్టీసీలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రస్తుతం ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐఎఫ్) ద్వారా చెల్లిస్తున్న రూ.3.60 లక్షల పరిమితిని యాజమాన్యం పెంచింది.
అమరావతి: ఆర్టీసీలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రస్తుతం ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐఎఫ్) ద్వారా చెల్లిస్తున్న రూ.3.60 లక్షల పరిమితిని యాజమాన్యం పెంచింది. రూ.6 లక్షల వరకు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీ తర్వాత మరణించిన వారికి ఈ పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పథకానికి ఉద్యోగుల నుంచి అదనపు రికవరీలు ఏమీ ఉండవు.
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) రికవరీ అవుతున్న వారందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. 2014 సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఉద్యోగి పింఛన్ రికవరీ వాటాను రూ.6,500 నుంచి రూ.15వేలకు పెంచే విధంగా చట్ట సవరణ జరిగింది. దీంతో చట్ట ప్రకారం ఇన్సూరెన్స్ బెనిఫిట్ను కూడా పెంచాల్సిన అవసరం ఉన్నందున ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు పద్మాకర్, దామోదరరావులు తెలిపారు.