కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాల నేతలు ఈరోజు భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రైతు నేతలు కోరారు. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం పరిశీలించాలని కోరారు. కృష్ణా ఆయకట్టులో నిర్మించిన ప్రాజెక్టులకు నష్టం జరగకుండా చేయాలని రైతు సంఘం నేత రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జలాల పంపిణీపై వెలువడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పుఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రిబ్యునల్ తుంగభద్ర జలాల్లో 4 టీఎంసీల అదనపు జలాలను మాత్రమే కేటాయించింది. అన్ని అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. మిగులు జలాలపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రాజెక్టులకు ఇది శరాఘాతంగా మారనుంది. హంద్రీనీవా, వెలుగొండ, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు 190 టీఎంసీల నీరు అవసరం. ఈ ప్రాజెక్టులను 14వేల కోట్లు రూపాయల ఖర్చు పెట్టి పూర్తి చేశారు.
ప్రస్తుతం వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. నికరజలాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్కే అతితక్కువ కేటాయింపు జరిగింది. కర్ణాటకకు 43 టీఎంసీలు, మహారాష్ట్రకు 65 టీఎంసీలు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్కు 39 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. మిగులు జలాల విషయంలో మహారాష్ట్రకు 35 టీఎంసీలు, కర్ణాటకకు 105 టీఎంసీలు, ఆంధప్రదేశ్కు 145 టీఎంసీలు ఇచ్చారు. అన్ని కలిపితే ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించారు. ప్రస్తుత తీర్పుతో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు 519 .5 నుంచి 524.25 మీటర్లకు పెరుగుతుంది. దీనివల్ల దాదాపు 100 టీఎంసీల నీటిని ఎక్కువుగా వాడుకోనున్నారు. మొత్తంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర రైతులకు శరాఘాతమేనని భావిస్తున్నారు.