
మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుటుంబ సభ్యులు
పెళ్లయి ఇంకా 13 రోజులైనా గడవలేదు. ఇంట్లో వేసిన పెళ్లి పందిరి కూడా ఇంకా తీయనే లేదు. అప్పుడే ఆ వరుడికి నూరేళ్లు నిండిపోయాయి. జ్వరం ఆయన్ను కాటేసి ఆయన్ను వివాహం చేసుకున్న ఆ వధువుకు వైధవ్యం మిగిల్చింది. విజయనగరం పూల్బాగ్ కాలనీలోని పన్నగంటి ఈశ్వరరావు జ్వరంతోబాధపడుతూ బుధవారం మృతిచెందాడు.
విజయనగరం ఫోర్ట్: జ్వరం బారిన పడి నవవరుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని పూల్బాగ్ కాలనీకి చెందిన పన్నగంటి ఈశ్వరరావు (24) కార్పెంటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి గత నెల 24న పూల్బాగ్ కాలనీకి చెందిన మౌనిక అనే మహిళతో వివాహాం జరిగింది. ఈ నెల నాలుగో తేదీన జ్వరం రావడంతో ఈశ్వరరావును కుటుంబ సభ్యులు నెల్లిమర్ల మిమ్స్కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కేజీహెచ్కు రిఫర్ చేశారు. దీంతో బుధవారం ఆయన్ని విశాఖ కేజీహెచ్కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.