
మంత్రి కొడాలి, చిత్తర్వును సన్మానిస్తున్న ముస్లిం నేతలు
సాక్షి, గుడ్లవల్లేరు (గుడివాడ): గుడివాడలో పోటీ చేయాలంటూ బలవంతంగా టీడీపీ తరఫున సీటు ఇచ్చి దేవినేని అవినాష్ను చంద్రబాబు మోసం చేశార ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర మాజీ కన్వినర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది చిత్తర్వు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు స్థానిక సమస్యల పరిష్కారానికై శనివారం సదస్సును చేపట్టారు. ఓడిపోయే సీటు అని తెలిసి కూడా దేవినేనిని గుడివాడకు పంపించిన బాబు ఆయన్ను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన అవినాష్ తమ పార్టీలో చేరితే అంత కడుపు మంట ఏమిటని ఆయన ప్రశ్నించారు.
మౌలిక వసతులకు పెద్దపీట...
రాష్ట్రంలో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేయనుందని కొడాలి నాని చెప్పారు. మార్చి నెల నుంచి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు కొడాలి నాని వెల్లడించారు. కౌతవరం ఒకటో వార్డు నుంచి మామిడికోళ్ల కాల్వ రోడ్డును నిర్మించాలని మంత్రి నానిని గ్రామస్తులు కోరారు.
యువ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షం...
సీఎం జగన్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంద ని చిత్తర్వు నాగేశ్వరరావు అన్నారు. యువకుడైన ఆయన నాయకత్వంలో రాష్ట్రం చాలా శాంతిభద్రతలతో ఉందని చెప్పారు. అనంతరం మంత్రి నానితో పాటు చిత్తర్వును అభిమానులు సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, కసుకుర్తి బాబ్జి, తాళ్లూరి మాధవ్, రాజనాల మెహ ర్ మోహనరావు, దుగ్గిరాల శేషుబాబు, డోకాల కనకరత్నారావు, బలుసు జితేంద్ర, కనుమూరి రామిరెడ్డి, అబ్దుల్ లతీఫ్, మహారెడ్డి మురళీకృష్ణ, పడమటి సుజాత, చందన నాగంనాయుడు, అల్లూరి ఆదియ్యనాయుడు పాల్గొన్నారు.
మంత్రి నానికి వినతులు
గుడివాడ: మంత్రి కొడాలి నానిని రాజేంద్రనగర్లోని ఆయన స్వగృహంలో పలువురు కలిసి సమస్యలపై వినతులు సమర్పించారు. అలాగే, ఇండోనేషియాలో జరిగే అంతర్జాతీయ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న చౌటపల్లికి చెందిన దాసరి మహేష్ను నాని అభినందించారు. దారి ఖర్చుల కింద రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. కాగా, కళాకారుల సమాఖ్య పట్టణ అధ్యక్షుడు బీవీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు మంత్రి నానిని కలిసి వచ్చే నెలలో జరిగే సమాఖ్య సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరుకావాలని కోరారు.