హామీలిచ్చి డబ్బుల్లేవంటే ఎలా? | ladies question chandrababu naidu over false promisses | Sakshi
Sakshi News home page

హామీలిచ్చి డబ్బుల్లేవంటే ఎలా?

Published Fri, Jul 18 2014 2:14 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

హామీలిచ్చి డబ్బుల్లేవంటే ఎలా? - Sakshi

హామీలిచ్చి డబ్బుల్లేవంటే ఎలా?

* పశ్చిమ గోదావరిలో సీఎం చంద్రబాబును నిలదీసిన మహిళలు
* నా వద్ద మంత్రదండం లేదు.. అయినా రుణమాఫీకి కట్టుబడి ఉన్నానన్న బాబు
* డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, అయితే టైం పడుతుందని వెల్లడి
* రైతులతో ముఖాముఖిలోనూ రుణ మాఫీపై ప్రశ్నించిన అన్నదాతలు
* డబ్బులు చెట్లకు కాయడంలేదు. సమస్య పరిష్కారానికి చూస్తా’ అంటూ సీఎం అసహనం

 
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘మీరే కదా రుణ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవంటే ఎలా’ అని పశ్చిమగోదావరి జిల్లాలో పలువురు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. గురువారం నరసన్నపాలెం, బయ్యన్నగూడెం, కొయ్యలగూడెం గ్రామాల్లో రైతులు, మహిళలతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. ఆయన ఆగిన ప్రతిచోట గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. సీతంపేటలో అనిశెట్టి పుణ్యవతి, మంగరాజు గంగారత్నం, తోటవరపు సీత తదితరులు బాబు కాన్వాయ్‌కు ఎదురుపడి రుణ మాఫీపై ప్రశ్నిం చారు. ‘కొంచెం సమయం ఇవ్వండి. ప్రస్తుతానికి రీషెడ్యూల్ చేస్తున్నాం.
 
ఇప్పుడైతే ఆదాయం లేదు. అప్పులే ఉన్నాయ్. నావద్ద మంత్రదండం లేదు’ అని అన్నారు. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో జరిగిన ముఖాముఖిలో కూడా మహిళలు రుణ మాఫీపైనే ప్రశ్నించారు. వారికి బాబు సమాధానమిస్తూ.. ‘మీ కష్టాలు మీకుంటే నా కష్టాలు నాకున్నాయ్. అందరికీ న్యాయం చేద్దాంలే’ అని అన్నారు. ‘ఎన్నికల సమయంలో మీరే కదా హామీలు ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు లేవం టే ఎలా’ అని నోముల దుర్గమ్మ గట్టిగా నిలదీసింది. కొయ్యలగూడెంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ డ్వాక్రా రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నానని, ఇప్పటికే కట్టిన వారికి, కట్టని వారికి మాఫీ చేస్తానని, అయితే టైం పడుతుందని చెప్పారు.
 
రాజధాని సంగతి తర్వాత.. రైతుల విషయం చూడండి
జంగారెడ్డిగూడెంలో జిల్లా అధికారులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష అనంతరం చంద్రబాబు నరసన్నపాలెంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. హైదరాబాద్ వంటి నగరాలు మూడు, నాలుగు నిర్మించే శక్తి ఉందంటూ సీఎం చెప్తుండగా.. టిడిపికే చెందిన మాజీ ఎంపీటీసీ కట్టా సత్యనారాయణ, మరికొందరు రైతులు కల్పించుకొని.. ‘రాజధాని సంగతి తర్వాత. ముందు మీరన్న రుణ మాఫీ, పొగాకు గిట్టుబాటు ధరల గురించి మాట్లాడండి’ అని అన్నారు.
 
ఏపీలో సరుకు రవాణా విప్లవం

జంగారెడ్డిగూడెం: ఏపీలో సరుకు రవాణా విప్లవం రానుందని, వాణిజ్యపరంగా రాష్ట్రాన్ని ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా మారుస్తామని చంద్రబాబు చెప్పారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘సముద్ర తీరానికి దూరంగా ఉన్న 50 శాతం ప్రాంతాలను రాష్ట్రంలో నిర్మించే పోర్టులకు అనుసంధానం చేయడమే నా లక్ష్యం. నవ్యాంధ్రలో లాజిస్టిక్స్ (సరుకు రవాణా) విప్లవంతో ముందుకు సాగడానికి ప్రణాళికలు చేస్తున్నా. కాలువల ద్వారా జల రవాణాను పునరుద్దరిస్తాం. కాకినాడ నుంచి విజయవాడ మీదుగా పాండిచ్చేరి వరకు విస్తరిస్తాం. ఉత్పత్తిదారు, వినియోగదారుల రాజ్యం సృ ష్టించేలా ప్రణాళికలు తయారుచేస్తాం’’ అని బాబు తెలిపారు.
 
హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా..

నరసన్నపాలెంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో గంగరాజు అనే రైతు కరెంటు సమస్యను ప్రస్తావించారు. ‘గవర్నర్ పాలనలోనే 4 గంటలు కరెంట్ వచ్చేది. మీరు వచ్చిన తర్వాత రోజుకు 2 గంటలే ఉంటోంది’ అని ప్రశ్నించారు. దీంతో బాబు ఆగ్రహిం చారు. ‘ఏం మాట్లాడుతున్నావ్. కథలు చెప్పొద్దు’ అంటూ గదమాయించారు. ‘సార్ నేను చెబుతోంది నిజమే’ అని ఆ రైతు అనగా.. బాబుకు ఆగ్రహం మరింత పెరిగింది. ‘ఏయ్ నువ్ ఊరికే అరవొద్దు. నేను ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడతా. నీకు సమస్యలు వస్తాయ్.
 
నీ అడ్రస్ కనుక్కుని హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా’ అని ఒకింత బెదిరింపు ధోరణితో మాట్లాడారు. గంగరాజు మళ్లీ స్పందిస్తూ.. ‘రెండు రోజులుగా కరెంట్ సరఫరా సరిగా లేదు. మంగళవారం అయితే గంట కూడా రాలేదు’ అని తెగేసి చెప్పారు. ఇందుకు సంఘీభావంగా పక్కనున్న రైతులు పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. దీంతో బాబు ‘సరే.. నాకు పనుంది. డ్వాక్రా మహిళలతో కొయ్యలగూడెంలో సమావేశం ఉంది. నువ్వు అక్కడికి రా. నీ విషయం అక్కడ తేలుస్తా’ అంటూ ముందుకు సాగారు.
 
కేసీఆర్ పిచ్చి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారు
విద్యార్థుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) పిచ్చి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం, బయ్యన్నగూడెం గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ కేసీఆర్ తీరును తప్పుబట్టారు.  టీఆర్‌ఎస్ ప్రభుత్వం లేనిపోని సమస్యలు సృష్టిస్తోంది. అక్కడి ముఖ్యమంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆంధ్రా, తెలంగాణ  రాష్ట్రాలు ఇండియా, పాకిస్థాన్ కాదు’ అని బాబు అన్నారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement