
సాక్షి, అమరావతి: మెట్రో రైలు లేదా లైట్ మెట్రో రైలు వ్యవస్థలను అమరావతిలో ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి గురువారం రాజ్యసభలో ఈమేరకు సమాధానం ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతిలో ఏ మెట్రో రైల్ ప్రాజెక్ట్నూ చేపట్టే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదన్నారు. ప్రధాని మాతృ వందనం పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జార్ఖండ్, చత్తీస్ఘడ్ కంటే కూడా వెనుకబడినట్లు మహిళా శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన సమాధాం ఇస్తూ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 19వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. పథకం కింద ఈ ఏడాది ఫిబ్రవరి 5వతేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో కేవలం 2,352 మంది మాత్రమే లబ్ధి పొందినట్లు తెలిపారు.
చీరాల పట్టు చీరలకు జియో ట్యాగింగ్ ప్రతిపాదన రాలేదు
చీరాల పట్టు చీరలకు జియా ట్యాగింగ్కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు గురువారం లోక్సభలో కేంద్ర మంత్రి అజయ్ తమ్తా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.