కారు చీకట్లో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపింది టీడీపీయేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అంగర : కారు చీకట్లో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపింది టీడీపీయేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం తూర్పు గోదావరి జిల్లా అంగరలో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చంద్రబాబు అన్నారు. రైతు, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్న హామీని నిలబెట్టుకుంటానని ఆయన తెలిపారు. రుణమాఫీకి ఆర్బీఐ కూడా అడ్డుపడిందని బాబు అన్నారు.
ఇతర రాష్ట్రాలను కూడా దృష్టిలో పెట్టుకుని సాయం చేసేందుకు కేంద్రం కూడా వెనకడుగు వేసిందన్నారు. రైతులను రుణ విముక్తులను చేసే బాధ్యత తనదేనన్నారు. రైతు సాధికార సంస్థకు వివిధ మార్గాల ద్వారా నిధులు సమకూరుస్తామని చంద్రబాబు అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. పేదలకు సగం ధరకే జనతా వస్త్రాలు అందిస్తామని, చేనేత కార్మికుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న హామీని నిలుపుకుంటామన్నారు.