
దుర్గగుడిలో తలసానికి కేలండర్ ఇస్తున్న ఈవో కోటేశ్వరమ్మ (ఫైల్)
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవస్థానం అధికారులు నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకొచ్చారు.
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవస్థానం అధికారులు నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకొచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో దుర్గగుడి ఆలయ ప్రాంగణంలోని ఈవో ఛాంబర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలన సరిగాలేదని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తలసాని వ్యాఖ్యలతో రాజకీయ దుమారం లేచింది.
ఈ నేపథ్యంలో ఈవో కోటేశ్వరమ్మ దుర్గగుడి ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి వచ్చే ప్రముఖలు ఇక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయకూడదన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు, వ్యక్తిగత, వ్యాపారానికి సంబంధించి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని ఆంక్షలు విధించారు. దుర్గగుడి ప్రతిష్టను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈవో కోరారు.