
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళ వారం వైఎస్సార్సీపీ సమర శంఖారావం పూరిం చనుంది.
నెల్లూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఏ క్షణం లోనైనా వెలువడనున్న తరుణంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళ వారం వైఎస్సార్సీపీ సమర శంఖారావం పూరిం చనుంది. కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలో భారీగా ఏర్పాట్లు జరుగు తున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజితులను చేస్తూ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సమర శంఖారావ సభలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నెల్లూరులో నాలుగో సభకు సన్నాహాలు పూర్తి చేసింది. జిల్లాలోని పది శాసనసభా నియోజకవర్గాల్లో ఇప్పటికే అన్ని పోలింగ్ బూత్లకూ కమిటీలు వాటికి కన్వీనర్లను నియమించారు.
వీరంతా మంగళవారం సాయంత్రం జరిగే శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా పేర్ల తొలగింపు, ఓటర్ల డూప్లికేటింగ్తో పాటుగా అనేక అవకతవకలు జరిగినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులను దిగువ క్షేత్ర స్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండే విధంగా వారిని జగన్ కార్యశీలురను చేయనున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటూ ఉందో లేదో తెలుసుకోవడంతో పాటుగా ఎక్కడైనా అక్రమాలు జరిగి పేర్లు తొలగింపునకు గురై ఉంటే వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జగన్ ఉద్భోదించబోతున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో అందరినీ మోసగించిన తీరుపై ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసేలా జగన్ పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేయనున్నారు.
నాలుగో శంఖారావం
జగన్ ఇప్పటికి మూడు జిల్లాల్లో సమర శంఖారావం కార్యక్రమాలను నిర్వహించారు. గత నెల 6వ తేదీన తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి పాదాల చెంత తొలి సమర శంఖారావాన్ని పూరించారు. ఫిబ్రవరి 7వ తేదీన కడపలోనూ, 11వ తేదీన అనంతపురంలోనూ సమర శంఖారావం కార్యక్రమాలను నిర్వహించి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. నాలుగో శంఖారావాన్ని నెల్లూరులో నిర్వహించబోతున్నారు. పార్టీ సీనియర్ నేతలు, సజ్జల రామకృష్ణారెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, కాకాణి గోవర్థన్రెడ్డితో సహా పలువురు నేతలు మంగళవారం జరగాల్సిన శంఖారావం కార్యక్రమ ఏర్పాట్లను ఇప్పటికే సమీక్షించారు.
నేటి కార్యక్రమం ఇలా...
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా నెల్లూరు నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల సెంటర్ వద్ద మైదానం చేరుకుని మధ్యాహ్నం 1 గంటకు జరిగే ‘సమర శంఖారావం’ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తరువాత బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.