
'సమైక్యవాదులకు హాని చేస్తే తీవ్ర పరిణామాలు'
సమైక్యగర్జనకు వెళ్లే సమైక్యవాదులకు ఎటువంటి హాని కలిగిన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి గౌరవం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మోసగించాలనుకుంటే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పండి, ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారని కాంగ్రెస్, టీడీపీలను నిలదీశారు. తమ ఏకైక ఎజెండా సమైక్యాంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు స్వార్థం వీడి ఒక ఎజెండాకు కట్టుబడాలని ఆయన కోరారు.
మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ జిల్లా రాయచోటిలో 6 రోజులుగా కొనసాగుతున్న విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. గాలివీడులో విద్యార్థిసంఘం నాయకుల ఆమరణ నిరాహరదీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా రాయచోటిలో పోస్టల్ సిబ్బంది 30వ రోజు గాంధీ వేషధారణలో రిలే నిరాహరదీక్ష చేపట్టారు.