
మాట్లాడుతున్న సత్యనారాయణ
తిరుపతి అర్బన్: తిరుమలకు రైళ్ల ద్వారా వచ్చే యాత్రికుల సౌకర్యార్థం సోమవారం నుంచి మరో 3 రైళ్లలో ఆర్టీసీ టికెట్లు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రైల్వే డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్(సీసీఎం) గుణశేఖర్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల యాత్రికుల కోసం నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో ఆర్టీసీ సహకారంతో తిరుమలకు ప్రయాణ టికెట్లు ఇప్పిస్తున్నామన్నారు. ఇందులో రోజుకు సుమారు 170 మంది యాత్రికుల వరకు రైల్వే–ఆర్టీసీ సంయుక్త సేవలను వినియోగించుకుంటున్నారన్నారు.
తిరుమలకు రైళ్లలో వచ్చే యాత్రికుల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో తమిళనాడులోని రామేశ్వరం వరకు నడుస్తున్న రామేశ్వరం ఎక్స్ప్రెస్తో పాటు కొయంబత్తూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, బెంగళూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(మధ్యాహ్నం 1:30 గంటకు తిరుపతికి వచ్చే రైలు) రైళ్లలో ఆర్టీసీ సిబ్బంది యాత్రికులకు టికెట్లు అందజేస్తారన్నారు. యాత్రికులు రైల్వేస్టేషన్లో దిగగానే నేరుగా ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment