రాష్ట్ర విభజనలో భాగంగా ఇంటర్బోర్డును కూడా విభజించారా లేదా అన్న విషయంలో అసందిగ్ధత నెలకొంది. ఉమ్మడి ప్రభుత్వ వైఖరి కారణంగా సాక్షాత్తూ ఓ ఐఏఎస్ అధికారే గందరగోళంలో పడ్డారు.
బోర్డు విభజన విషయంపై గందరగోళం
హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా ఇంటర్బోర్డును కూడా విభజించారా లేదా అన్న విషయంలో అసందిగ్ధత నెలకొంది. ఉమ్మడి ప్రభుత్వ వైఖరి కారణంగా సాక్షాత్తూ ఓ ఐఏఎస్ అధికారే గందరగోళంలో పడ్డారు. ఇంటర్మీడియెట్ బోర్డు రెండు రాష్ట్రాలకు ఏడాది వరకు సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 10వ షెడ్యూలులో పేర్కొన్నారు. అయితే పాలనాపరమైన అవసరాల దృష్ట్యా బోర్డును విభజించాల్సిందేనని ప్రభుత్వం విభజన కమిటీకి గతంలోనే ప్రతిపాదనలు పంపినా.. దానిపై ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. జూన్ 2న ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బాధ్యతలను ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దాంతోపాటే, ఇంటర్విద్య, సాంకేతిక విద్య, కళాశాలవిద్య కమిషనర్గా కూడా ఆమెకే బాధ్యతలు అప్పగించింది. మంగళవారం ఇంటర్ బోర్డు కార్యదర్శిగా మినహా ఇతర బాధ్యతలను, బుధవారం ఇంటర్ విద్యకు సంబంధించిన బాధ్యతలను ఆమె స్వీకరించారు. విభజనకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు అక్కడ జరగకపోవడంతో సెకండరీ విద్య ముఖ్యకార్యదర్శిగా పని చేసిన రాజేశ్వర్ తివారీని, విభజన వ్యవహారాల కమిటీకి నేతృత్వం వహించిన టక్కర్ను ఆమె సంప్రదించారు. బోర్డు విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకునే వరకూ ఆగాలని వారు సూచించారు. దీంతో ఆమె బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేసిన పత్రాన్ని తీసుకుని తిరిగి వెళ్లిపోయారు.