
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 312వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం అంతకాపల్లి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వీఆర్ అగ్రహారం క్రాస్, పొగిరి, మర్రివలస క్రాస్కు చేరుకుంటారు. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం వైఎస్ జగన్ పాదయాత్ర ఎచ్చెర్ల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. గంగువారి సిగడాం మండలంలోని గేదెలపేట క్రాస్, మెట్టవలస క్రాస్, పలఖండ్యాం, సంతవురిటి వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది.
వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. జననేత ఇప్పటివరకు 3,369.5 కిలోమీటర్లు నడిచారు.