
ఫెడ్ పాలసీ ముందు జాగ్రత్త
స్వల్పంగా తగ్గిన సూచీలు
ముంబై: భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో మంగళవారం స్టాక్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై..కొద్దిపాటి నష్టాలతో ముగిసాయి. ఫెడ్ రెండు రోజుల పాలసీ సమీక్షా సమావేశం మంగళవారం మొదలయ్యింది.
దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని, మార్కెట్ అధిక విలువకు ట్రేడవుతుండటం కూడా ఇందుకు కారణమని విశ్లేషకులు చెప్పారు. బీఎస్ఈ సెన్సెక్స్ 21 పాయింట్ల తగ్గుదలతో 32,402 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5.55 పాయింట్లు క్షీణించి 10,147.55 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ప్రపంచ సంకేతాలు సైతం బలహీనంగా వుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
తగ్గిన బ్లూచిప్ షేర్లు... : పలు బ్లూచిప్ షేర్లు లాభాల స్వీకరణ ప్రభావంతో తగ్గాయి. కోల్ ఇండియా, లార్సన్ అండ్ టుబ్రో, ఎస్బీఐ, సన్ఫార్మా, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్లు 2.49 శాతం క్షీణించాయి.
టాటా మోటార్స్ 4.5 శాతం అప్...:టాటా మోటార్స్ షేర్లను రూ. 421 ధరతో ఒక బ్లాక్డీల్లో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ కొనుగోలు చేసిన ప్రభావంతో ఈ షేరు 4.5 శాతం ఎగిసి రూ. 423.65 వద్ద ముగిసింది.