
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్అండ్ఎఫ్ఎస్ వ్యవహారంపై ప్రత్యేకంగా ఎంౖMð్వరీ కమిషన్ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ ఆర్థికాంశాల స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఈ వివాదంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల పాత్రపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సీనియర్ కాంగ్రెస్ నేత ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలోని స్థాయీ సంఘం ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. ‘ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి.
సంక్షోభానికి కొన్నాళ్ల ముందే గ్రూప్ సంస్థలకు ఓవర్ రేటింగ్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీలతో పాటు గ్రూప్లో అతి పెద్ద వాటాదారు ఎల్ఐసీ సహా ఇతరత్రా సంస్థాగత వాటాదారుల పాత్రపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉంది‘ అని కమిటీ పేర్కొంది. ఇక, దేశీయంగా ఇన్ఫ్రా ప్రాజెక్టులకు భారీ స్థాయిలో రుణాలిస్తున్న కంపెనీ కావడంతో ఐఎల్అండ్ఎఫ్ఎస్ కార్యకలాపాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించింది. కంపెనీలు ఎల్లకాలం ఒకే రేటింగ్ ఏజెన్సీని కొనసాగించేలా కాకుండా ఆడిటర్ల తరహాలో వీటికి కూడా నిర్దిష్ట కాలావధి నిర్దేశించి, రొటేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావొచ్చని పేర్కొంది.