సాక్షి, ముంబై : బీజేపీ రథ సారథి నరేంద్రమోదీ నేతృత్వంలో రెండవసారి కొలువు దీరనున్న బీజేపీ సర్కారు ఒక కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దేశంలో కాలుష్యరహిత ఇంధనాల వాడకాన్ని పెంచే కృషిలో భాగంగా ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రానిక్ వాహనాల వాడకాన్ని భారీగా ప్రోత్సహించనుంది. దీనికి సంబంధించిన ఒక దీర్ఘకాలిక పాలసీని రూపొందించనుంది. అలాగే దేశీయంగా బ్యాటరీ ఉత్పత్తులకు ఊతమివ్వనుంది. దీనికి మద్దతుగా బ్యాటరీ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను భారీగా పెంచనుంది.
ముఖ్యంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న కాలంతీరిన వాహనాల నిషేధానికి రంగం సిద్ధం చేస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశ ప్రజలను ఈవీల వాడకం ప్రోత్సహించేందుకు వీలుగా కొత్త చట్టాన్ని రూపొందించనుంది. దేశీయ ఆటోమొబైల్ రంగానికి ఊతమివ్వడంతోపాటు, దేశంలో పెరుగుతున్న కాలుష్య కాసారాన్ని రూపుమాపాలని భావిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నితీ ఆయోగ్ ఇటీవల రూపొందించిన ముసాయిదా ప్రతిపాదన, ఈ విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించనుందని సమాచారం. రానున్న కాలంలో దేశంలోని, ద్విచక్ర వాహనాలను మూడు చక్రాల ఆటో రిక్షాలను పూర్తిగా ఎలక్ట్రిక్వాహనాలుగా మార్చాలని సిఫారసు చేసిందట.
ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సొసైటీ ఆఫ్ డేటా ప్రకారం, గత ఏడాది 54,800 ఈ-వాహనాలతో పోలిస్తే 12 నెలల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లో లక్ష 26వేలు అంటే రెట్టింపునకు పైగా విక్రయాలు నమోదయ్యాయి. మార్చి 31 వ తేదీకి భారతదేశం 21 మిలియన్ల మోటర్బైక్లను, స్కూటర్లను విక్రయాలతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ద్విచక్ర మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. అదే సమయంలో కేవలం 3.3 మిలియన్ల కార్లు యుటిలిటీ వాహనాలను విక్రయించింది.
కాగా దేశంలో ఊహించని మెజార్టీతో బీజేపీ సాధించిన విజయాన్ని చిన్న, మధ్య తరహా ఇండస్ట్రీతో పాటు, దిగ్గజ పారిశ్రామిక వర్గాలు స్వాగతించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment