
సాక్షి, లక్నో: రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్న రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు బోగీల్లో ప్యానిక్ బటన్ ఏర్పాటు చేయనున్నామని ఈశాన్య రైల్వే విభాగం (ఎన్ఈఆర్) ప్రకటించింది. అలాగే రాత్రి పూట మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. రైళ్ళలో మహిళల భద్రతను బలోపేతం చేయాలన్న యోచన దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో మహిళల నియామకాలతోపాటు, రాత్రిపూట రైళ్ళలో మహిళా బోగీలన్నింటిలో మహిళా పోలీసులను నియమించాలని, ప్యానిక్ బటన్ వ్యవస్థను నెలకొల్పనున్నట్లు ఎన్ఈఆర్ సీనియర్ అధికారి సంజయ్ యాదవ్ ప్రకటించారు.
ప్రమాద పరిస్థితుల్లో ఉన్న మహిళలు ఈ ప్యానిక్ బటన్ను నొక్కిన వెంటనే బోగీ బయట, రైలు డ్రైవర్ వద్ద, కంట్రోల్ రూంలో ప్రమాద హెచ్చరిక లైట్లు వెలుగుతాయని వివరించారు. ప్రస్తుతం, మహిళా ప్రయాణీకులు కాల్ లేదా ఎస్ఎంఎస్ , హెల్ప్లైన్ నెంబర్లు,లేదా అత్యవసర పరిస్థితిలో గొలుసు-లాగడం లాంటి వాటిమీద ఆధారపడవలసి వస్తోందీ కానీ ప్యానిక్బటన్ వ్యవస్థతో తక్షణమే చర్య తీసుకునేఅవకాశం ఉందని తెలిపారు. సబర్బన్ రైళ్ల బోగీల్లో సీసీటీవీ ఏర్పాటును కూడా ఆలోచిస్తున్నామన్నారు. అలాగే మహిళా బోగీలను తొందరగా గుర్తించేందుకు వీలుగా రంగులను మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment