
న్యూఢిల్లీ : దేశీయ దిగ్గజ మిడ్-సైజు మోటార్సైకిల్ తయారీదారి రాయల్ ఎన్ఫీల్డ్ తన రెండు కొత్త 650 సీసీ మోటార్సైకిల్స్ను ఆస్ట్రేలియా మార్కెట్కి తరలిస్తోంది. ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటర్ జీటీ 650 పేర్లతో రూపొందించిన ఈ బైక్లను ఆస్ట్రేలియన్ మార్కెట్లో రిటైల్ చేయబోతోంది. వీటి ధరలు ఆస్ట్రేలియా మార్కెట్లో 10వేల ఏయూడీ(సుమారు రూ.5.04 లక్షలుగా)గా, 10,400 ఏయూడీ( సుమారు రూ.5.24 లక్షలుగా)గా ఉన్నాయి. ఈ రెండు కొత్త బైక్లను చెన్నై ప్లాంట్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ తయారీచేసింది. భారత మార్కెట్లో కూడా వీటిని 2018 ఏప్రిల్ తర్వాత లాంచ్ చేయబోతోంది. అయితే భారత్లో వీటి ధరలు ఎంత ఉంటాయనేది కంపెనీ రివీల్ చేయడానికి నిరాకరించింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత మార్కెట్లలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్స్ ధరలను పోల్చి చూస్తే.. త్వరలో భారత్లోకి రాబోతున్న ఈ బైక్స్ ధరలను అంచనా వేయొచ్చని ఇండస్ట్రి వర్గాలంటున్నాయి. హిమాలయన్ బైక్ ధర భారత్లో రూ.1.68 లక్షలుగా ఉండగా.. ఆస్ట్రేలియాలో రూ.3.02 లక్షలుగా ఉంది. అంటే కొత్త ఇంటర్సెప్టర్ 650 బైక్ ధర భారత మార్కెట్లో సుమారు రూ.3 లక్షలుగా ఉండొచ్చని తెలుస్తోంది. కాంటినెంటర్ జీటీ 650 ధర దానికి కంటే కాస్త ఎక్కువగా ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ల మాదిరిగానే, ఈ కొత్త బైక్లు కూడా రెట్రో స్టయిల్లో రూపొందాయి. కాంటినెంటర్ జీటీ 650 కేఫ్ రేసర్, ఇది ప్రస్తుతమున్న సింగిల్-సిలిండర్ కాంటినెంటర్ జీటీ 535 మాదిరిగానే ఉంది. ఇంటర్సెప్టర్ 650 తేలికగా రైడ్ చేయొచ్చు. ఈ రెండు కొత్త బైక్లు కొత్త 650సీసీ, ఎయిర్ కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్తో రూపొందాయి. ఈ బైక్స్లో అతిపెద్ద 320ఎంఎం ఫ్రంట్, 240ఎంఎం రియర్ డిస్క్ బ్రేక్, అడ్జస్టబుల్ గ్యాస్ ఛార్జ్డ్ రియర్ షాక్ అబ్జార్బర్స్, ప్రీమియం పిరెల్లీ టైర్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లున్నాయి.