
బంగారం బ్యాంక్ ఏర్పాటు చేయాలి
దేశంలో బంగారం అక్రమ రవాణా(స్మగ్లింగ్)కు అడ్డుకట్టవేసేందుకు రానున్న బడ్జెట్లో నిర్దిష్టమైన చర్యలను ప్రకటించాలని పారిశ్రామిక మండలి అసోచామ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ: దేశంలో బంగారం అక్రమ రవాణా(స్మగ్లింగ్)కు అడ్డుకట్టవేసేందుకు రానున్న బడ్జెట్లో నిర్దిష్టమైన చర్యలను ప్రకటించాలని పారిశ్రామిక మండలి అసోచామ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇందులో ప్రధానంగా గోల్డ్ బ్యాంక్ ఏర్పాటు, వాణిజ్య బ్యాంకులు పసిడి డిపాజిట్ ఖాతాలను ప్రవేశపెట్టేలా చేయాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించింది.
విదేశాల్లో నిధుల సమీకరణ(ఓఎఫ్సీబీ) ద్వారా అక్కడ నుంచి బంగారం కొనుగోలు చేసి గోల్డ్ బ్యాంక్ నిల్వ చేస్తుందని.. ఈ పుత్తడిని ఉపయోగించుకునే వాణిజ్య బ్యాంకులు తమ కస్టమర్లకు గోల్డ్ డిపాజిట్ ఖాతా(జీడీఏ)లను అందించడం ద్వారా నిరుపయోగంగా పడిఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు వీలవుతుందని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. బడ్జెట్లో తమ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొచ్చే అంశాన్ని జైట్లీ పరిశీలించాలన్నారు.
‘జీడీఏకు దాదాపు సేవింగ్స్ బ్యాంక్(ఎస్బీ) ఖాతాకు ఉండే ఫీచర్లన్నీ ఉంటాయి. ఇందులో నేరుగా కరెన్సీ డిపాజిట్ల(రూపాయల్లో) రూపంలోగానీ, ఆభరణాలేతర ఫిజికల్ గోల్డ్(నాణేలు, కడ్డీలు) రూపంలోనైనా కస్టమర్లు బంగారాన్ని దాచుకునే ఆప్షన్ ఉంటుంది. కస్టమర్ దగ్గరనుంచి తీసుకునే బంగారం బరువుకు తగ్గట్లుగా జీడీఏలో గోల్డ్ యూనిట్లను(నోషనల్గా) బ్యాంక్ జమ చేస్తుంది.
తన అవసరాలమేరకు గోల్డ్ను ఉంచుకొని మిగతాది గోల్డ్ బ్యాంక్కు పంపుతుంది. దీనికి ప్రతిగా గోల్డ్ బ్యాంక్ జారీ చేసే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా ఖాతాలోని బంగారంపై భవిష్యత్తులో రాబడి వస్తుందనేది తెలుస్తుంది. భవిష్యత్తులో దేశంలో పెరుగుతున్న బంగారం డిమాండ్కు అనుగుణంగా రుణాలిచ్చేందుకు, ఇప్పటికే ఉన్న ఫిజికల్ గోల్డ్ స్టాక్ను బయటికి తెచ్చేందుకు ఇది దోహదం చేస్తుంది.’ అని అసోచామ్ వివరించింది.
ఈ చర్యలతో దేశంలోకి బంగారం దిగుమతులు తగ్గుతాయని కపూర్ పేర్కొన్నారు. భారతీయులకు ఫిజికల్ గోల్డ్ను కొనుగోలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారమని.. అయితే, దీనినుంచి వారిని మళ్లించాలంటే ప్రోత్సాహకాలతోకూడిన పాలసీ చర్యలు అవసరమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. బంగారం దిగుమతులకు అడ్డుకట్టవేయడం కోసం ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని విడతలవారీగా ఏకంగా 10 శాతానికి పెంచేయడం, ఇతరత్రా నియంత్రణ చర్యలు చేపట్టడం తెలిసిందే. దీంతో స్మగ్లింగ్ కూడా భారీగా పెరిగిపోయేందుకు దారితీస్తోంది. మరోపక్క, బడ్జెట్లో ఈ సుంకాన్ని కూడా తగ్గించాలని ఆభరణాల పరిశ్రమవర్గాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి.