
సాక్షి, హైదరాబాద్ : పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. మద్యం తాగుతు కారు నడిపి పట్టుబడ్డ అతగాడు.. తన చేతిలోని బీరు సీసాను మాత్రం పడయకుండా అలాగే పట్టుకుని పోలీసుల ముందే తాగుతూ హల్చల్ చేశాడు. అర్థరాత్రి జూబ్లీహిల్స్ నీరుస్ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో బంజారాహిల్స్ పోలీసులకు ఇతగాడు చిక్కాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కారు సీజ్ చేశారు.
మరోవైపు తప్పతాగి వాహనాలు నడిపిన 48మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే పట్టుబడ్డవారి నుంచి 20 కార్లు, 28 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ వారికి సోమవారం బేగంపేటలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాలపై తామెంత అవగాహన కల్పించినా మందుబాబుల్లో మార్పు రావట్లేదని అన్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.