
సాక్షి, గుంటూరు : వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియులతో కలిసి భర్తలను హతమారుస్తున్న సంఘటనలు నానాటికి పెరుగుతున్నాయి. మొన్న స్వాతి, నిన్న జ్యోతి సంఘటనలు సంచలనంగా మారగా తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాదెండ్ల మండలం పునుగుపాడు గ్రామానికి చెందిన నల్లబోతు నరేంద్ర(27), శ్రీవిద్య అనే ఇద్దరు భార్యభర్తలు. శ్రీవిద్య గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి తన ప్రియుడితో కలిసి కుట్ర చేసింది. ఎవరికి అనుమానం రాకుండా మద్యంలో సైనెడ్ కలిపి తాగించింది. అనుమానం రాకుండా ఆత్మహత్య చిత్రించింది. అందుకుగాను అతడి డెడ్బాడీని తీసుకెళ్లి పునుగుపాడువద్ద ఉన్న కాలువలో పడేసింది. ఈ సంఘటన గత నెల డిసెంబర్ (2017) 19న చోటుచేసుకుంది. అయితే, తల్లిదండ్రుల అనుమానం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీవిద్య అతడి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం గొట్టిపాటి వీరయ్య చౌదరి, గుంజి బాలరాజు, పూజల చౌడయ్య అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టగా శ్రీవిద్య మాత్రం పరారీలో ఉంది.