
సాక్షి, సిటీబ్యూరో: సోషల్మీడియాలో వాట్సాప్ ద్వారా వదంతులు సృష్టించిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని అహ్మద్నగర్కు చెందిన రహ్మత్ షరీఫ్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. ఇతగాడు ఆదివారం నాలుగు నిమిషాల నిడివితో ఓ ఆడియో క్లిప్ రూపొందించాడు. అందులో తానే మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీ జరిగిన మాదిరిగా హైదరాబాద్లోని కలహాలు జరిగే ఆస్కారం ఉందంటూ మాట్లాడాడు. దీనికి ఆధారాలు అంటూ కొన్ని అసందర్భ వ్యాఖ్యలు జోడించాడు. ఈ ఆడియో వాట్సాప్లో వైరల్ కావడంతో సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. తీవ్రమైన వ్యాఖ్యలతో ఉన్న ఈ ఆడియోపై సుమోటో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... తన ఆడియో వైరల్గా మారిందని, ఫలితంగా తీవ్ర పరిణామాల ఎదుర్కోవాల్సి వస్తుందని షరీఫ్ స్నేహితులు అతడిని భయపెట్టారు. దీంతో మంగళవారం అతడే వెళ్లి బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో విషయం చెప్పి లొంగిపోయాడు. ఈ ఆడియోపై అప్పటికే సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదై ఉండటంతో అక్కడి అధికారులు సైబర్ కాప్స్కు అప్పగించడంతో అరెస్టు అయ్యాడు. పుకార్లు సృష్టించవద్దని సీపీ అంజనీకుమార్ ట్వీట్లో సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment