కుమారుడి బర్త్‌డే నాడే ఘటన..భార్యను కత్తితో.. | Doubtful Husband killed his Wife | Sakshi
Sakshi News home page

అనుమానమే ఆయువు తీసింది!

Feb 23 2018 12:35 PM | Updated on May 24 2018 12:31 PM

Doubtful Husband killed his Wife  - Sakshi

అనాథలైన పిల్లలు ,నిందితుడు లింగమూర్తి ,భర్త చేతిలో హత్యకు గురైన మహేశ్వరి

అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈక్రమంలో చాలాసార్లు గొడవలు  జరిగాయి. ఇది భరించలేని ఆమె అతనిపై కేసు కూడా పెట్టింది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. అయినా అనుమానం తీరని అతను ఆమెను కత్తితో నరికి చంపాడు. ఫలితంగా ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.

కర్నూలు,బనగానపల్లె: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం పట్టణంలోని తెలుగుపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సుమారు 12 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం  జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన నాగన్న, మునెమ్మ దంపతుల కుమార్తె ఎం.మహేశ్వరి(35)ని పట్టణంలోని తెలుగుపేటకు చెందిన బాలనాగమ్మ కుమారుడు లింగమూర్తికి ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలం పాటు వీరి సంసారం సాఫీగా జరిగింది. ఆ తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న లింగమూర్తి ఆమెను వేధించేవాడు. ఈక్రమంలో అతడిపై  మహేశ్వరి తల్లిదండ్రులు 2014లో అలంపూర్‌ పోలీసు స్టేషన్‌లో అదనపు కట్నం వేధింపుల కేసు పెట్టారు.

అప్పటి నుంచి ఆమె భర్తకు దూరంగా ఇదే కాలనీలో అద్దె ఇంట్లో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే అమె గురించి ఇరుగుపొరుగు వారు రకరకాలు చెబుతుండడంతో మనస్థాపం చెందిన భర్త ఉదయం ఇంటికి వద్దకు వెళ్లి ఆమె మెడపై నరికి చంపాడు. అనంతరం మృతదేహాన్ని బయటకు తెచ్చి అక్కడే కూర్చున్నాడు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రాకేష్‌ ఘటన స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌చార్జ్‌ సీఐ కంబగిరిరాముడు అక్కడికి వచ్చి వివరాలు సేకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా కుమారుడు శివకుమార్‌ పుట్టినరోజు నాడే తల్లి హత్యకు గురికావడంతో కాలనీలో విషాదం నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement