మిఠాయిలో పురుగుల మందు కలుపుకుని.. | Love Couple Attempt To Suicide In tekkali | Sakshi
Sakshi News home page

మిఠాయిలో పురుగుల మందు కలుపుకుని..

Sep 14 2019 8:01 AM | Updated on Sep 14 2019 8:01 AM

Love Couple Attempt To Suicide In tekkali - Sakshi

పురుగుల మందు కలిపిన మిఠాయిలు    

సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న తమకు పెళ్లి చేయరని వేదనతో మిఠాయిల్లో క్రిమిసంహారక మందు కలుపుకుని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు ప్రయత్నించింది. తక్కువ జీతం వచ్చే అబ్బాయితో ఏ విధంగా జీవిస్తావని తన కుమార్తెను తండ్రి ప్రశ్నించడంతో చనిపోవడానికి వీరు సిద్ధపడ్డారు. ఈ ఘటన స్థానిక మేజర్‌ పంచాయతీ పరిధి జగతిమెట్ట కొండపై శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు గ్రామానికి చెందిన పొట్నూరు షణ్ముఖరావు పలాసలోని మణప్పరం గోల్డ్‌లోన్‌ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయన టెక్కలి ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు.

వీరిద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో షణ్ముఖరావు ఆమె ఇంటికి వెళ్లి కొద్ది నెలల క్రితం పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తర్వాత చెబుతానని ఆమె తండ్రి చెప్పి పంపించేశాడు. ఈ నేపథ్యంలో తక్కువ జీతం వచ్చే అబ్బాయితో ఏ విధంగా జీవిస్తావని తన కుమార్తెను ప్రశ్నించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన ప్రియుడితో చనిపోవడానికి సిద్ధపడింది. ఈ మేరకు ఇద్దరు కలసి స్వీట్స్‌ బాక్స్‌ పట్టుకుని స్థానిక జగతిమెట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ పురుగుల మందు, చీమల మందు కలుపుకుని వాటిని తినగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. అయితే ప్రియుడు ఈ విషయమై తన చిన్నాన్న టంకాల శ్రీనుకు సమాచారం ఇచ్చాడు. వెంటనే శ్రీను హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేయగా, ఇరువురికి ప్రాణాపాయం తప్పినట్టు వైద్యురాలు జయలక్ష్మి తెలిపారు. ఈఘటనపై టెక్కలి ఎస్‌ఐ బీ గణేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.  


చికిత్స పొందుతున్న షణ్ముఖరావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement