
సాక్షి, ముజఫర్నగర్ : ఓ పక్క దేశవ్యాప్తంగా త్రిపుల్ తలాక్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతోపాటు చట్టసభల్లో ధుమారం రేగుతుండగా మరోపక్క, ట్రిపుల్ తలాక్ సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి తన భార్యకు అకారణంగా ట్రిపుల్ తలాక్ చెప్పడంతోపాటు భవనంపై నుంచి తోసేశాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన వివరాలు అక్కడి పోలీసులు తెలియజేస్తూ..
‘బాధితురాలు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ఎముకలు కూడా విరిగిపోయాయి’ అని చెప్పారు. ఈ నెల (జనవరి) 15న గర్ముక్తేశ్వర్ ఆలయ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె భర్త పరారీలో ఉన్నారని వెల్లడించారు. వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల హక్కుల రక్షణకోసం మరో ట్రిపుల్ తలాక్ బిల్లును ఇప్పటికే లోక్సభలో ఆమోదించిన విషయం తెలిసిందే.