అత్తగారింటికి వచ్చి వెళుతుండగా.. | Wife Daughter Deceased in Bike Accident Husband Injured Khammam | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ తల్లీ కూతుళ్ల మృతి

Published Tue, Jun 2 2020 12:44 PM | Last Updated on Tue, Jun 2 2020 12:44 PM

Wife Daughter Deceased in Bike Accident Husband Injured Khammam - Sakshi

భర్త శ్రీహరితో నాగసుజాత(ఫైల్‌) చాట్ల ప్రజ్ఞాశ్రీ(ఫైల్‌)

ఖమ్మంరూరల్‌: బైక్‌ను లారీ ఢీకొనడంతో తల్లీకూతుళ్లు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తల్లంపాడు గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రాంపురం గ్రామానికి చెందిన చాట్ల శ్రీహరి ఆదివారం భార్య నాగసుజాత(26),కూతురు ప్రజ్ఞాశ్రీ (3)లను తీసుకుని చింతకాని మండలం రామకృష్ణాపురంలోని తన అత్తగారింటికి వచ్చాడు. పది రోజుల క్రితం కూసుమంచి మండలం అగ్రహారంలో తమ సమీప బంధువు ఒకరు మృతి చెందగా, సోమవారం బంధువు దశదిన కర్మలో పాల్గొనేందుకు శ్రీహరి దంపతులు తమ కూతురిని తీసుకుని రామకృష్ణాపురం నుంచి అగ్రహారం బయల్దేరారు.

బైక్‌పై వెళ్తుండగా తల్లంపాడు గ్రామం శివారులోని వశిష్ట ఫుడ్స్‌ ఫ్యాక్టరీ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెనుక కూర్చున్న నాగసుజాత, ప్రజ్ఞాశ్రీ ఎగిరి రోడ్డుపై పడిపోయారు. లారీ వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు పక్కకు పడిపోయిన శ్రీహరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీహరి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ అక్బర్‌పాషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాణాల రాము తెలిపారు. కాగా శ్రీహరి కొంతకాలంగా ఖమ్మంలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఖమ్మం నుంచి వెళ్లి రెండు నెలలుగా స్వగ్రామం రాంపురంలో ఉంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement