చెక్పోస్టుల్లో ఏసీబీ తనిఖీలు
– అనధికార డబ్బు రూ.69,765 సీజ్
– ఇద్దరు ఏఎంవీఐలు, ఇద్దరు హోంగార్డులపై చర్యలకు సిఫారసు
కర్నూలు: కర్నూలు శివారులోని హైదరబాద్ జాతీయ రహదారిపై పంచలింగాల క్రాస్ రోడ్డు వద్దనున్న అంతర్రాష్ట్ర రవాణా శాఖ, వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టులలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నిరంతరాయంగా తనిఖీలు చేపట్టారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ జయరామ రాజు, సీఐ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో వాణిజ్య పన్నుల తనిఖీ కేంద్రంలో సోదాలు నిర్వహించారు. అక్కడ అన్నీ సక్రమంగా ఉండటంతో సమీపంలోని ఆర్టీఏ చెక్పోస్టులో సోదాలు జరిగాయి. ఏఎంవీఐలు శ్రీనివాసులు, రఘునాథ్తో పాటు హోంగార్డు హుసేని, నరసింహులు కార్యాలయం వద్ద ఉండి వాహనాల తనిఖీ చేస్తుండటం గుర్తించారు. కార్యాలయం గల్లాపెట్టెలో రూ.3,28,165 ఉండగా, అందులో రూ.69,765 అనధికార సొమ్ముగా వెల్లడయింది. అందుకు సంబంధించి రవాణా శాఖ అధికారులు లెక్కలు చూపకపోవడంతో అనధికార సొమ్మును సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేసి చర్యలకు ప్రభుత్వానికి రిపోర్టు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు.