పట్టణ ఆరోగ్య కేంద్రాల ప్రైవేటీకరణ తగదు
భీమవరం: పట్టణ ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, జీవో 43ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
భీమవరం: పట్టణ ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, జీవో 43ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం బి.బెనర్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకుడు జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ పట్టణాల్లోని మురికి వాడల్లో నివాసముంటున్న పేదలకు అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా సేవలందిస్తున్నారని, వీటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. ఇలా జరిగితే పేదలకు వైద్యాన్ని దూరం చేసినట్టు అవుతుందన్నారు.
తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామంటూ గొప్పగా ప్రచారం చేసిన చంద్రబాబునాయుడు, హామీలు నెరవేర్చకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్ల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు ఎం.వైకుంఠరావు, ఆర్.వెంకటేశ్వర్లు, ఎండీ రిజ్వాన్, ఝాన్సీ, రజిని, లత పాల్గొన్నారు.