జిల్లాలో 4.50లక్షల ఎకరాలకు సాగునీరు
Published Thu, Jul 28 2016 11:29 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
పాన్గల్: భీమా, కేఎల్ఐ, నెట్టంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల ద్వారా పాలమూరు జిల్లాలో ఖరీఫ్కు 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని వివిధ గ్రామాల గుండా ప్రవహించే భీమా కాల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో రైతులకు సాగునీరు అందుతుందన్నారు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, 24 గంటల విద్యుత్, ప్రతి ఇంటికి తాగునీరు, మహిళలకు దీపం సిలిండర్లు తదితర పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోనే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
భీమా ఈఈపై ఆగ్రహం
భీమా ప్రాజెక్టు ఈఈ ఉమాపతిరావుపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర సముద్రం వద్ద రెండు మోటార్లు ఏర్పాటు చేసి కాల్వలకు నీరు విడుదల చేయాలని చెప్పినా ఒకే మోటారు ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదేశించినా పనులు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. నీరు సరఫరా అవుతున్న తీరు అధికారులు కాల్వల వెంట నిత్యం పరిశీలించాలని, నీటి ప్రవాహానికి కాల్వలు తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
దాడిచేసిన వారిపై క్రిమినల్ కేసులు
అధికారులపై దాడిచేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. కాల్వల ద్వారా నీరు సరఫరా కావడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ, బీజేపీ నాయకులు మతిస్థిమితం కోల్పోయి అధికారులపై దాడులు చేస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదిలేదని వారిపై నాన్బెయిల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేష్నాయుడు, జెడ్పీటీసీ రవికుమార్, విండో చైర్మన్ బాల్రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్యాదవ్, భీమా, మండలస్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement