
2020కి 200 కోస్ట్గార్డు నౌకలు!
► కోస్ట్గార్డు ఐజీ రాజన్ బర్గోత్రా
ముత్తుకూరు(సర్వేపల్లి): 2020 సంవత్సరం నాటికి ఇండియన్ కోస్ట్గార్డు బలగం 200 నౌకలకు పెరుగుతుందని ఐసీజీఎస్ ఐజీ రాజన్ బర్గోత్రా పేర్కొన్నారు. కృష్ణపట్నం ఇండియన్ కోస్ట్గార్డుకు చేరిన 3వ నౌక ‘చార్లీ–423’ను గురువారం ఏపీ డీజీపీ ఎన్ సాంబశివరావు ప్రారంభించారు.వేడుకల్లో బర్గోత్రా ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రస్తుతం కోస్ట్గార్డు పరిధిలో 109 నౌకలు దేశం మూడు వైపులా నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయన్నారు. ఇవి కాకుండా 16 హెలికాప్టర్లు కూడా కోస్ట్గార్డు పరిధిలో విధులు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
త్వరలో 14 హెవీ హెలికాప్టర్లు రానున్నాయన్నారు. నౌకల తయారీలో భాగంగా ఇండియన్ కోస్టుగార్డు పురోగతిలో ఎల్అండ్టీ సంస్థ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఎల్అండ్టీ ప్రతినిధి, విశ్రాంత కెప్టెన్ క్రిస్ట్ మాట్లాడుతూ ఇండియన్ కోస్ట్ట్గార్డు నౌకలను తమ సంస్థ డిజైన్ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జిల్లాఎస్పీ విశాల్గున్నీ, పోర్టు సీఈఓ అనిల్ ఎండ్లూరి, డీఐజీలు హర్బోలా, శశికుమార్ పాల్గొన్నారు.