- పలు శాఖలతో కలెక్టర్ కరుణ సమీక్ష
గుట్కాపై ఉక్కుపాదం మోపాలి
Published Fri, Aug 5 2016 8:32 PM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
ఏటూరునాగారం : ఏజెన్సీలో పెట్రేగిపోతున్న గుట్కాపై ఉక్కుపాదం మోపాలని, గుడుంబాను పూర్తిగా లేకుండా చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పలు శాఖలతో ఐటీడీఏ సమావేశపు గదిలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలు చాలా వరకు నిర్మూలించాలని అన్నారు. గుట్కాల వల్ల టీబీ వస్తుందని ఇటీవల చేసిన పరీక్షల్లో తేలిందని, వాటికి కారణమైన మత్తు పదార్థాల నిర్మూలన కోసం కృషి చేయాలన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్, పోలీసు శాఖ చొరవ చూపే విధంగా చర్యలు చేపడుతామన్నారు.
ఐకేపీ పనితీరు బాగలేదు..
ఐటీడీఏ పరిధిలోని టీఎస్పీ మండలాల్లో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) పనితీరు అస్తవ్యస్తంగా ఉందని కలెక్టర్ ఏరియా కోఆర్డినేటర్పై మండిపడ్డారు. మూడు మండలాల్లోని మహిళా గ్రూపుల ద్వారా చేపట్టిన గుప్పేడు బియ్యం 155 వీఓ సంఘాలకు గాను ఏడు వీఓలు మాత్రమే చేస్తున్నట్లు ఏసీ గోవింద్చౌహన్ కలెక్టర్కు వివరించారు. నిరుపేదల కోసం చేపట్టిన గుప్పేడు బియ్యం సేకరణపై నిర్లక్ష్యం చూపినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసి ఐకేపీ సిబ్బంది పనితీరుపై బాగలేదని, ఇలా చేస్తే పేదలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు.
267 గ్రూపులకు 67 గ్రూపులు బాగా ఉండడం ఏమిటని, మిగతావి ఎలా డిపాల్ట్ అయ్యాయన్నారు. ఇలా చేయడం వల్ల ప్రైవేట్ వడ్డీ రుణాలకు మహిళా సంఘాలు అలవాటు పడే ప్రమాదం ఉందన్నారు. కొత్తగూడ ఏసీ వరలక్ష్మి పనితీరు బాగా ఉందని, గ్రూపులు కూడా మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. ఈఎస్ఎస్ కింద ఇచ్చిన మేకలను లబ్ధిదారులు కోసుకొని తింటున్నారా... లేక చనిపోతున్నాయని అబద్దాలు చెబుతున్నారా... ఐకేపీ వాళ్లు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం వారం రివ్వూ్య పెట్టాలని పీఓను ఆదేశించారు.
భాగస్వాములను చేయాలి
గోదావరి పరివాహాక ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో పారిశుధ్యంపై చొరవ చూపే విధంగా మహిళా సంఘాలను భాగస్వాములు చేయాలని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం ద్వారా మొక్కల పెంపకంలో మహిళా సంఘాల చొరవ చూపాలన్నారు.
సంయుక్తంగా పక్కా భవనాలు
ఐటీ డీఏ కింద రూ.3 లక్షలు, ఈజీఎస్ కింద రూ.5 లక్షలతో కలిపి రూ. 8 లక్షలతో ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించే విధంగా చూడాలని ఐటీడీఏ పీఓ అమయ్కుమార్, డ్వామా ఏపీడీ శ్రీనివాస్ కుమార్ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో మునిగ, నిమ్మకాయ, కరివేపాకు, బచ్చల కూర, పాలకూర, గోంగూర నాటే విధంగా హార్టికల్చర్ అధికారులు ఉచితంగా విత్తనాలను అందించాలన్నారు.
ఐఏపీ నిధులు వస్తే ఏజెన్సీలో అభివృద్ధి
ఏజెన్సీలోని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వచ్చే ఐఏపీ నిధుల ద్వారా నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ కోటిరెడ్డిని ఆదేశించారు. 59 భవనాల్లో 20 పూర్తి కాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయన్నారు. మండల సమాఖ్య భవనాలు 13లో ఎనిమిది నిర్మించామని, మిగతా ఐదింటికి స్థలాల కోసం అన్వేషిస్తున్నట్లు ఈఈ తెలిపారు. సమీక్షలో ఆర్డీఓ మహేందర్జీ, ఏపీఓ వసందరావు, డీఈఈ మల్లయ్య, ఐకేపీ ఏపీడీ నూరొద్దీన్, ఎంఐ ఈఈ రాంప్రసాద్, డీఈఈ యశ్వంత్, ఏఈఈ శ్యాం, పీహెచ్ఓ సంజీవరావు, ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ నరేందర్, పాల్గొన్నారు.
బాధితుల వేడుకోలు...
మండలంలోని మారుమూల గ్రామాలకు బస్సులు రావడం లేదని, ఇసుక లారీలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాంబాయి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మేడారం పూజారి ఆనందరావు చనిపోయిన తీరు అనుమానంగా ఉందని భార్య ఉషారాణి కలెక్టర్కు విన్నవించారు. బయ్యక్కపేటకు చెందిన ఓ వ్యక్తిపై అనుమానం ఉందని ఆమె వెల్లడించారు. ఇళ్ల స్థలాలు ఇప్పించాలని స్థానిక విలేకరులు కలెక్టర్కు వినతి అందజేశారు. కార్యక్రమంలో నూక ప్రభాకర్, అలువాల శ్రీను, వెంకన్న, అఫ్జల్, గంపల శివ, కృష్ణ, లాలయ్య, భిక్షపతి, శ్రీను, గంగాధర్, సత్యం, విజయ్కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement