6వ తేదీలోగా కేసులు, 144 సెక్షన్ తొలగించాలి
-
బాధితుల తరఫున ఉద్యమిస్తాం
-
బాధిత గ్రామాల్లో పర్యటించిన తుని ఎమ్మెల్యే రాజా
తొండంగి : దివీస్ ల్యాబొరేటరీస్ ఏర్పాటును వ్యతిరేకించిన ఆ ప్రాంత మహిళలపై ప్రభుతం పెట్టిన అక్రమ కేసులను, ఇక్కడ విధించిన 144 సెక్షన్ నవంబర్ ఆరో తేదీలోగా ఎత్తివేయాలని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఎస్పీతో చర్చించామని, అవసరమైతే కలెక్టర్ను కూడా కలుస్తామని ఆయనన్నారు. దివీస్ ప్రతిపాదిత భూముల్లో రెవెన్యూ అధికారులు చెట్లను తొలగించిన నేపధ్యంలో అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రాజా శనివారం పంపాదిపేట, కొత్తపాకలు గ్రామాల్లో పర్యటించారు.అక్కడి బాధిత రైతుల సమస్యలు తెలుసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాలుష్య పరిశ్రమ ఏర్పాటుకు తీరప్రాంత పేద రైతుల భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పోలీసులను చూసి ప్రజలు భయాందోళన చెందడమే గాకుండా శుభకార్యాలు చేసుకోవడానికి కూడా జంకుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలు సమావేశాలు కూడా నిర్వహించుకునే పరిస్థితి ఈగ్రామాల్లో ప్రస్తుతం లేదన్నారు. తమ భూముల్లోని పచ్చని చెట్లను అధికారులు అన్యాయంగా తొలగించారని అంతకుముందు రైతులు, మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు.