Published
Wed, Sep 21 2016 10:51 PM
| Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
సాగునీటి కోసం ఉద్యమిద్దాం
యాదగిరిగుట్ట : భువనగిరి, ఆలేరు ప్రాంతానికి సాగు, తాగు నీటి కోసం ఉద్యమానికి సిద్ధమవుతామని మాజీమంత్రి, టీడీపీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగు నీటి కోసం మిషన్ భగీరథ ప్రవేశపెట్టే బదులు ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో గంధమల్ల, బస్వాపూర్లో రిజర్వాయర్లు వేగంగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పాటు తపాస్పల్లి ద్వారా రాజాపేట, ఆలేరు మండలాలకు నీరిందించాలన్నారు. జిల్లా సాధించిన మాదిరిగా, గోదావరి జలాలు సాధించి తీరుతామన్నారు. అనంతరం తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు రాజకీయ, భూ వ్యాపార బ్రోకర్లుగా అవతారమెత్తి ప్రజలను జలగల్లా పీల్చుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలపైనే పోలీసులతో లాఠీచార్జ్ చేయించిన ఘనత గొంగిడి సునీతకే దక్కిందన్నారు. టీ డీపీ మండల అధ్యక్షుడు దడిగె ఇస్తారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పల్లెపాటి బాలయ్య, రాజాపేట మండల అధ్యక్షుడు గుంటి మధుసూదన్రెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్, ఆకుల రాజేష్, ఆరె శ్రీను, గొట్టిపర్తి శ్రీనివాస్గౌడ్, కందుల మల్లేష్, పులుగం భిక్షపతి, రేగు బాలనర్సయ్య, చల్లూరి స్వామి, మచ్చ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.