
పేదలతో ప్రభుత్వం చెలగాటం
► ధరలను నియంత్రించడంలో విఫలం
► ధ్వజమెత్తిన ఐద్వా నాయకురాళ్లు
► కూరగాయల బండితో వినూత్న నిరసన
అనంతపురం అర్బన్ : పేదలు, సామాన్య మధ్యతరగతి ప్రజల జీవి తాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నా యకురాళ్లు ధ్వజమెత్తారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, కాయగూరలను నియంత్రించడంలో పూర్తి విఫలమైయ్యిందని మండిపడ్డారు. కడుపులు కట్టేసుకుని ఉప్పుకి పప్పుకి దూరమై బతికే పరిస్థితి కల్పించిందని దుమ్మెత్తిపోశారు. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, కాయగూరల ధరలను నిరసిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో శనివారం నగరంలో వినూత్నంగా కూరగాయల బండితో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, సావిత్రి మాట్లాడారు.
నిత్యావసర వస్తువులు, కాయగూరల ధరలు భారీగా పెరుగుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నడూ లేనంతగా కందిపప్పు, మినపపప్పు, టమాట, పచ్చిమిర్చి ఇలా అన్ని రకాల సరుకులు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయని, దీంతో పేదలు తిండి కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ధరలను అదుపు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి చంద్రిక, నాయకురాళ్లు రామాంజినమ్మ, అరుణ, దిల్షాద్, విజయ, లక్ష్మిదేవి, ఉమ తదితరులు పాల్గొన్నారు.