ఆల్కాట్తోట (రాజమండ్రి) : ఓటుకు కోట్లు కేసులో తనను కావాలనే ఇరికించారని ఆ కేసులో నిందితుడు, ఆలిండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయూసిస్ అండ్ యూనియన్ చైర్మన్ డాక్టర్ హ్యారీ సెబాస్టియన్ ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సెన్ డబ్బులకు కక్కుర్తిపడి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి తనను ఈ కేసులో ఇరికించారని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం జరిగిన అభిషేక మహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో తామంతా నిర్దోషులమని, ఈ విషయం త్వరలోనే తేలుతుందన్నారు. క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ విమానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ నెలలో గుంటూరులో క్రైస్తవ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. మైనార్టీ వర్గంలో ఉన్న క్రైస్తవులకు కో ఆప్షన్ పదవులు ఇవ్వకుండా, ముస్లింలకే ఇస్తున్నారని ఆరోపించారు. క్రైస్తవులను మైనార్టీ వర్గాలుగా గుర్తించకుండా కేవలం దళితులుగానే చూస్తున్నారన్నారు. క్రైస్తవ మత సంస్థలు మతమార్పిడి చేస్తున్నారంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
'ఓటుకు కోట్లు కేసులో నన్ను కావాలనే ఇరికించారు'
Published Tue, Oct 27 2015 9:04 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement