
నీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్ పేరు
► మంత్రి హరీష్రావు
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుకు.. జలసాగరుడు ఆర్.విద్యాసాగర్ రావు పేరు పెట్టనున్నట్టు భారీ నీటిపారుదల శాఖామంత్రి టి.హరీష్రావు అన్నారు. త్వరలో క్యాబినెట్ ఆమోదానికి పెడతామన్నారు. ఈ విషయం సీఎం స్వయంగా చెప్పారన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆర్.విద్యాసాగర్రావు స్మారక నాటకోత్సవాల సభలో మంత్రి మాట్లాడారు. సీఎం ఆశయాలు, విద్యాసాగర్రావు కల అయిన కోటి ఎకరాలకు నీరు పారించి చూపిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేగవంతంగా సాగుతుండంటే ఆయన ఒత్తిడే కారణమన్నారు.
‘నీళ్లు – నిజాలు’ పుస్తకంతో తెలంగాణ సమాజ స్వరూపాన్నే మార్చి వేసిన ధీరోదాత్తుడు విద్యన్న అని గుర్తు చేసుకొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. విద్యాసాగర్ రావు గొప్ప సాంస్కృతిక వాది, కళామూర్తి అని చెప్పారు. నటుడు, రచయిత, ప్రయోక్త అని చెప్పారు. రచయిత దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ నదీ జలాల్లోని అన్యాయాన్ని గుండె గొంతుకతో చెప్పిన గొప్ప ఆదర్శమూర్తి విద్యాసాగార్ రావు అన్నారు. ఈ సందర్భంగా ‘ఆర్. విద్యాసాగర్ రావు నాటకాలు – నాటికలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో సినీ దర్శకుడు బి.అమరేంద్ర, టి.సందరంలను సన్మానించారు.