కాపులను బీసీల్లో చేరిస్తే సహించం
– మంజునాథ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తే ఉద్యమాలు
– ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్కిరణ్
కర్నూలు(అర్బన్): అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న కాపులను బీసీ జాబితాలో చేరిస్తే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్కిరణ్ అన్నారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డేరంగుల మాట్లాడుతూ కాపులు బలహీన వర్గాలు కాదని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పలు ఉన్నతాధికారులుగా వారు ఉన్నారన్నారు. ఏపీలో రాజకీయ పరంగా కూడా వారు అభివృద్ధిచెందారన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి, నలుగురు మంత్రులతో పాటు 22 మంది శాసనసభ్యులు ఉన్నారని చెప్పారు. సినిమా రంగాన్ని సైతం నడిపిస్తున్నది కాపు సామాజిక వర్గానికి చెందిన వారే నని చెపా్పరు. వ్యవసాయరంగంలో, పరిశ్రమల ఏర్పాటులో కూడా కాపులే ముందున్నారని చెప్పారు. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బలహీన వర్గాలుగా చూపించేందుకు మంజునాథ కమిషన్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని డేరంగుల హెచ్చరించారు. ఏపీబీసీ సంఘం ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.
బీసీ కులాలను వెలుగులోకి తెస్తాం ...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి అరు దశాబ్దాలు గడుస్తున్నా అనేక బీసీ కులాలు చట్టసభల మెట్లు కూడా ఎక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కులాలకు కూడా రాజకీయ ప్రాధాన్యత లభించేందుకు సంఘం తీవ్రంగా కృషి చేయనుందని చెప్పారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఈ సురేష్గౌడ్, కార్యదర్శి వలీబాషా,, జిల్లా అధ్యక్షుడు నవీన్కుమార్, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య తదితరులు పాల్గొన్నారు.