
తెలంగాణలో బలమైన శక్తిగా ఉంటాం
సీమాంధ్రకు సీఎంను అయినా.. తెలంగాణను వదులుకోను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి
వైఎస్ను మించిన కమ్యూనిస్టు లేడు
2009లో మధిరలో రూ.150 కోట్లతో వైఎస్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చే శారు. అప్పట్లో ఇక్కడి ఎమ్మెల్యే వెంకటనర్సయ్య ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని మించిన కమ్యూనిస్టు లేరని వైఎస్ను గొప్పగా పొగిడారు. దివంగత వైఎస్ను మించిన గొప్ప కమ్యూనిస్టు ఎవరూ లేరు. కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు, పార్టీలకతీతంగా ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖరరెడ్డి స్థానం సంపాదించుకున్నారు. - వైఎస్ జగన్
ఖమ్మం/నల్లగొండ: తెలంగాణలో ఇతర పార్టీల దిమ్మ తిరిగేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిందని, ఎన్నికలయ్యాక కూడా తాము ఇక్కడ బలమైన శక్తిగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ‘‘తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదని కొందరన్నారు. అందరి గూబ పగిలేలా.. అందరికీ అర్థమయ్యేలా తెలంగాణలో 98 అసెంబ్లీ, 11 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాం. మన భాషరాని, మన దేశస్తురాలు కాని సోనియా గాంధీ ఓట్ల కోసం, సీట్ల కోసం ఇక్కడ రాజకీయాలు చేస్తోంది. ఈ భాష తెలిసిన వాడిని, ఈగడ్డ మీద పుట్టిన వాడిని. ఈతెలంగాణ నాది. నేనెందుకు ఉండకూడదు తెలంగాణలో? దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాకింత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారు’’ అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ ప్రజలకు రాజకీయ అవగాహన ఎక్కువ. ఇక్కడ ఎక్కువ స్థానాలు వచ్చే పార్టీకి కూడా 40 నుంచి 45 స్థానాలు మించవు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముఖ్య భూమిక పోషించబోతోంది’’ అని అన్నారు. సీమాంధ్రలో తమిళనాడు తరహా ఫలితాలు వస్తాయని, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు అంతా ఒకే పార్టీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఓటేస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో తన సోదరి షర్మిల తన తరఫున తెలంగాణలో ఓదార్పు యాత్ర చేస్తారని, తెలంగాణపై ఆమె ఎక్కువ ధ్యాస పెడతారని చెప్పారు. ‘వైఎస్ఆర్ జనభేరి’ పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్రెడ్డి శనివారం నల్లగొండ జిల్లా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోనూ, ఖమ్మం జిల్లా మధిర, కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రాల్లోనూ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సభలకు పోటెత్తిన ప్రజల్ని ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
తెలంగాణను వదులుకోను..
‘‘రాబోయే రోజుల్లో సీమాంధ్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా.. అయినా తెలంగాణను మాత్రం మర్చిపోను. రాష్ట్రాన్ని విడగొట్టినా.. తెలుగుజాతిని, తెలుగు ప్రజల మనసును విడగొట్టలేరు. ఇక్కడి వారికి ఏ కష్టం వచ్చినా అక్కడి వారు తోడుగా ఉంటారు.. అక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇక్కడి ప్రజలు తోడుగా ఉంటారు.. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణను విడిచిపెట్టేది లేదు. రాబోయే రోజుల్లో నా సోదరి షర్మిలతో తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయిస్తా. ఓదార్పు యాత్రతో ఎవరూ వెళ్లని మారుమూల గ్రామాలకు వెళ్లినపుడు.. ప్రతి పేదవాడి దగ్గరకు వెళ్లి, వారి గుడిసెలోకి వెళ్లి, వారితో మాట్లాడినపుడు ఆ పేదవాడి తలంపులే మన తలంపులవుతాయి. ఆ పేద వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చాలన్న ఆలోచన మన మదిలో పరుగెత్తుతుంది. అప్పుడు మంచి రాజకీయ నాయకులు తయారవుతారు.. పేదల కష్టాలు అర్థం అవుతాయి. అందుకే షర్మిల చేత ఓదార్పు యాత్ర చేయిస్తాను. ప్రతి పేదవాడి సమస్యలు తెలియాలంటే.. ప్రతీ రాజకీయ నేత ఓదార్పు కార్యక్రమం చేపట్టాలి.
ఓదార్పుతోనే మేనిఫెస్టోకు అంకురార్పణ..
ఓదార్పు అన్న ఒక్క మాట కోసం ఎంతవరకైనా వెళ్లాను. ప్రతి ఇంటికీవెళ్లా. ప్రతి వారితో మాట్లాడా. ఏడెనిమిది వందల ఇళ్లకు వెళ్లా. వారిని చూసే, వారి కష్టాలు తెలుసుకునే మేనిఫెస్టోను రూపొందించా. అక్కా చెల్లెమ్మల కోసం, వారి పిల్లల చదువుల కోసం, అవ్వా తాతల కోసం, రైతుల కోసం, డ్వాక్రా మహిళల కోసం పథకాలు రూపొందించా. రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించేందుకు రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తా. డ్వాక్రా మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తా. సీమాంధ్రలో సీఎంగా అధికారంలోకి రాగానే ఐదు సంతకాలు పెడతానని ప్రతి సభలో చెబుతున్నా.. వీటితోపాటు మరో ఆరు కార్యక్రమాలు కలిసి 11 కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడి సీఎంతో కూడా ఇవే కార్యక్రమాలను చేయించేందుకు కృషి చేస్తా.
కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి..
మరో మూడు రోజుల తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ పాలనను గుర్తు తెచ్చుకోండి. సీఎం అంటే ఇలా ఉండాలని దేశానికి చాటిచెప్పిన మహానేత. ఆయన మన మధ్య లేకున్నా, ప్రతి వ్యక్తీ ఆయన తమ గుండె లోతుల్లో ఉన్నాడని అంటున్నారు. వైఎస్ ఎప్పుడూ పేదవాడి కి తోడూ నీడగా నిలిచారు. కులాలు, మతాలు, ప్రాంతాలని చూడలే దు. పేదవాడి గుండెల్లో స్థానం కోసమే చూశాడు. మహానేత అందించిన సువర్ణ పాలన కావాలంటే వైఎస్ఆర్ సీపీని ఆశీర్వదించండి. దివంగత ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో ఒక్క రేషన్కార్డు, ఒక్క పింఛన్, ఒక్క ఇల్లు ఇచ్చారా..? అని ఎన్నికల కోసం ఓటడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్లని అడగండి. మీకెందుకు ఓటెయ్యాలని గట్టిగా ప్రశ్నించండి.
కాంగెస్కు చరమ గీతం పాడండి
కాంగ్రెస్కు మనస్సాక్షి లేదు.. కావాల్సింది ఓట్లే. అందుకే రాష్ట్రం, దేశం తలదించుకునేలా కాంగ్రెస్ రాజకీయం చేసింది, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడాలి. వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయం అన్న పదానికి అర్థం మారింది. ఎంతగా రాజకీయాలు దిగజారాయంటే చదరంగంగా మారాయి. ఒకరిని తప్పిస్తే, ఒక పార్టీని లేకుండా చేస్తే, జైల్లో అక్రమంగా పెడితే ఓట్లు రాలుతాయేమోనని రాజకీయాలు చేశారు. ఓట్ల కోసం ఏగడ్డి అయినా తినడానికి ఇవాళ్టి రాజకీయ నాయకులు వెనుకాడటం లేదు. కాంగ్రెస్ పాలనను అంతమొందించి వైఎస్ సువర్ణయుగం తెచ్చుకునేందుకు పోరాడాలి. విశ్వసనీయత, నిజాయితీ - కుళ్లు, కుతంత్రాల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించండి.
ఓటేసేముందు బాబు భయానక పాలనను గుర్తు తెచ్చుకోండి
తన తొమ్మిదేళ్ల భయానక పాలనలో ఏఒక్క రోజూ పేదల గురించి, రైతులు, వృద్ధులు, వితంతువుల గురించి, పేదల ఆరోగ్యం, వృద్ధుల పింఛన్ గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అడ్డగోలుగా అబద్ధాలాడుతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. ఓటేసేందుకు వెళ్లే ముందు చంద్రబాబు భయానక పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ఆయన కోరారు. నిజాయితీ అనే పదానికి అర్థం తెలియని, విశ్వసనీయత లేని మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఎన్నికల మందు ఒక మాట, ఆతర్వాత ఒక మాట్లాడటం బాబుకు కొత్తేమీ కాదని అన్నారు.
ఖమ్మం, మహబూబాబాద్లో నేడు జగన్ ప్రచారం
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఆదివారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సీట్ల పరిధిలోని పలు నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నట్లు పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు స త్తుపల్లిలో రోడ్షో, 11గంటలకు వైరాలో, 12.30కు ఖమ్మంలో రోడ్షో నిర్వహించనున్నారు. మధ్యా హ్నం 3కు మహబూబాబాద్ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్లోని అడ్డగుట్టలో, రాత్రి 8 గంటలకు శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసే సభల్లో జగన్ ప్రసంగించనున్నారు.