
పలు రాష్ట్రాలలో వర్షాల బీభత్సం..
81 మంది మృతి, 80 లక్షల మందిపై ప్రభావం
* మయన్మార్లో 27కు చేరిన వరద మృతులు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలను ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకుతోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో 48 మంది, రాజస్తాన్లో 28 మంది, ఒడిశాలో ఐదుగురు వరదల్లో చనిపోయారని హోంశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. గుజరాత్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మణిపూర్ రాష్ట్రాలను కలుపుకొని 80 లక్షల మంది ప్రభావి తులయ్యారని తెలిపింది.
రాజస్తాన్లో నలుగురు చిన్నారులు సహా ఐదుగురు వరదల్లో గల్లంతయ్యారు. వర్షాల వల్ల ఒక్క గుజరాత్లోనే 40 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కోమెన్ తుపానుతోపాటు పిడుగుపాటు, కూలిన గోడలు, కరెంట్ షాక్, వరదల్లో కొట్టుకుపోయిన ఘటనల్లో బెంగాల్లో అత్యధికంగా 48 మంది చనిపోయారు. 5,672 పశువులు సైతం మృత్యువాతపడ్డాయి. మణిపూర్లో కొండ చరియలు విరిగిపడి 20 మంది మృతిచెందడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం వ్యక్తంచేశారు. మయన్మార్లోనూ వరదలు వల్ల 27 మంది మృతిచెందగా, 1.50 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు.