
వెయ్యి మందికి డిపాజిట్లు గల్లంతు
* గ్రేటర్ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైన వారు 1009
* టీఆర్ఎస్కు 15 డివిజన్లలో, ఎంఐఎంకు 10 డివిజన్లలో
హైదరాబాద్:
ఎంతటి వారికైనా గెలుపోటములు సహజం. పెద్ద పార్టీ అయినా.. చిన్న పార్టీ అయినా అంతే. అగ్రస్థాయిలో రికార్డు సాధించిన పార్టీలోనూ డిపాజిట్లు దక్కని వారుంటారు. తక్కువ సీట్లలో గెలిచిన వారిలోనూ అత్యధిక ఓట్లు పొందిన వారూ ఉంటారు. అలాంటి విచిత్రమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చోటు చేసుకుంది. భారీ విజయాలు నమోదైన పార్టీల్లోనూ డిపాజిట్లు గల్లంతైన వారున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 1333 మంది పోటీ చేయగా, వారిలో గెలుపు పోతే పోయింది కానీ కనీసం డిపాజిట్ కూడా దక్కలేదే అని వాపోతున్న వారు 1009 మంది ఉన్నారు. వీరికి కనీస డిపాజిట్ కూడా దక్కలేదు. గ్రేటర్ ఎన్నికల్లో 99 డివిజన్లలో విజయంతో రికార్డు సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ నుంచి సైతం డిపాజిట్లు కోల్పోయిన వారున్నారు.
అలాగే 60 స్థానాల్లోనే పోటీ చేసి 44 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎంలోనూ డిపాజిట్లు పోగొట్టుకున్నవారున్నారు. పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో డిపాజిట్లు కోల్పోయిన వారిలో ఇండిపెండెంట్లదే అగ్రస్థానం. మొత్తం పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్ల కంటే తక్కువ (దాదాపు 16.67 శాతం) ఓట్లు వస్తే డిపాజిట్ గల్లంతైనట్లు పరిగణిస్తారు. నామినేషన్ సందర్భంగా వారు చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు.ప్రధాన పార్టీల విషయానికి వస్తే డిపాజిట్లు గల్లంతైన వారిలో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీనుంచి పోటీ చేసిన 149 మంది అభ్యర్థుల్లో 126 మంది అభ్యర్థులకు కనీస డిపాజిట్లు దక్కలేదు. ఇక టీడీపీలో 36 మందికి, బీజేపీలో 20 మందికి, టీఆర్ఎస్లో 15 మందికి డిపాజిట్లు దక్కలేదు. ఎంఐఎం పది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది.
పార్టీ అభ్యర్థులు
కాంగ్రెస్ 126
బీఎస్పీ 55
టీడీపీ 36
సీపీఎం 26
లోక్సత్తా 25
బీజేపీ 20
టీఆర్ఎస్ 15
సీపీఐ 16
ఎంబీటీ 15
ఏఎన్సీ 12
ఎంఐఎం 10
ఎస్పీ 5
డబ్ల్యుపీఓఐ 3
డీబీపీ 3
జేడీయూ 2
టీవైఎస్పీ 1
ఏఐఎఫ్బీ 1
టీఎస్ఎల్పీ 1
ఎస్డబ్ల్యుపీ 1
జీఎస్పీ 1
ఇండిపెండెంట్లు 634