
ఆ సముద్రం ఎర్రబారింది..
అది ఎర్ర సముద్రం కాదు. మామూలు నీలిరంగులో ఉండే సముద్రమే.
కోపెన్హాగెన్: అది ఎర్ర సముద్రం కాదు. మామూలు నీలిరంగులో ఉండే సముద్రమే. ఏకంగా 250 పైలట్ తిమింగలాల గొంతులను కసుక్కున కోయడంతో చిమ్మిన నెత్తురు నీటి రంగును అలా మార్చేసింది. అడవి మనుషులకు దూరంగా వాటి మానాన అవి సముద్ర జలాల్లో బతుకీడుస్తుంటే స్థానికులు సముద్ర జలాల్లోకి చొచ్చుకెళ్లి, వాటిని ఒడ్డుకు తరుముకొచ్చి మరీ ఇలా చంపేశారు. డెన్మార్క్లోని ఫరో దీవిలో ప్రతి ఏటా ఉత్సవం పేరిట జరిగే ఈ దారుణ కృత్యం శుక్రవారం చోటుచేసుకుంది. బౌర్, తోర్షావ్ బీచుల్లో జరిగిన ఈ బీభత్స బలికాండను 'సీ షెప్పర్డ్' అనే సముద్ర జీవుల సంరక్షణ సంస్థ వీడియోలు, ఫొటోలు తీసి ప్రపంచానికి విడుదల చేసింది. ఈ దారుణ కాండను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తమ సంస్థ సభ్యులు నలుగురిని కూడా నిర్బంధించినట్టు ఆ సంస్థ ప్రకటించింది.
ఒక్క ఫరో దీవిలో తప్ప డెన్మార్క్ అంతటా ప్రభుత్వం పైలట్ తిమింగలాల వేటను నిషేధించింది. అనాదిగా ఈ దీవివాసులు వీటినే ప్రధాన ఆహారంగా స్వీకరిస్తారు. అందుకే ఈ దీవిలో వీటి వేటను నిషేధించి ఉండకపోవచ్చు. అయితే ప్రతి ఏటా ఉత్సవం పేరిట ఇంత పెద్ద సంఖ్యలో తిమింగళాలను చంపడం వల్ల స్థానికులకు కూడా పెద్దగా ప్రయోజనం లేదు. ఆహారాన్ని శీతలీకరణ ద్వారా భద్రపర్చుకోవడం లేదా ఇతర ప్రాంతాలకు ఎగుమతిచేసే సౌకర్యాలుగానీ అక్కడ లేవు.